కలం, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీశ్రావుకు (Harish Rao) సిట్ (SIT) నోటీసులు జారీచేయడం బీఆర్ఎస్ నేతలు ఊహించలేదు. మరోసారి ఆయనను విచారించడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. “అవసరమైతే మళ్ళీ విచారణకు రావాల్సి ఉంటుంది” అని పోలీసులు ఆయనకు స్పష్టం చేశారు. మరోసారి ఆయనకు సమన్లు జారీ అయ్యే అవకాశమున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుతో సంబంధం ఉన్న సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదించరాదని, ప్రభావితం చేయరాదని, జోక్యం చేసుకోరాదని హరీశ్రావుకు సిట్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే తదుపరి విచారణ నిమిత్తం మళ్లీ పిలుస్తామని తెలియజేసినట్లు సిట్కు నేతృత్వం వహిస్తున్న నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఆయనకు సిట్ నోటీసులు జారీచేసి విచారణకు పిలిచిందంటూ ఆ పార్టీ నేతలు సహా పలువురు చేస్తున్న కామెంట్లపై కూడా సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు.
కుమారుడి ఫ్లైట్ జర్నీ కోసం సడలింపు :
ఫోన్ ట్యాపింగ్ కేసుల (Phone Tapping Case) విచారణకు హాజరైన హరీశ్రావు (Harish Rao) తనంతట తానుగా చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని సాయంత్రం తొందరగానే ఆయనను పంపించినట్లు సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. ముందుగా రూపొందిన షెడ్యూలు ప్రకారం తన కుమారుడి విమాన ప్రయాణం ఉన్నందున ఆయన విచారణను ముగించి సమయానికి వెళ్ళేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. కేవలం ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాత్రమే ఆయనను ప్రశ్నించామని సజ్జనార్ (Sajjanar) వివరించారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్లను అనధికారికంగా, చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ చేయడం, వారిపై నిఘా ఉంచడం వంటి తీవ్రమైన ఆరోపణలపై గతేడాది మార్చి 10 నుంచి దర్యాప్తు జరుగుతున్నదని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కొంతమంది నిందితులపై మెయిన్ ఛార్జిషీట్ (మొదటిది) దాఖలు చేశామని తెలిపారు. ఇదే కేసుకు సంబంధించిన ఇతర అంశాలపై ఇంకా లోతుగా దర్యాప్తు జరుగుతూ ఉన్నదన్నారు.
Read Also: యాదాద్రిలో పైచేయి ఎవరిదీ..?
Follow Us On: X(Twitter)


