కలం, వెబ్ డెస్క్: ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలంటూ నర్సంపేటలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన డ్రైవర్ శంకర్ గౌడ్ (Narsampet RTC Driver) మృతి చెందారు. 80 శాతం కాలిన గాయాలతో ఉన్న ఆయనను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే చనిపోయారు. కంచన్ బాగ్ డీఆర్డీవో ఆసుపత్రిలో శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఉంచారు. నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్న శంకర్ గౌడ్ ఉదయం డిపో వద్ద జరిగిన ఆందోళనల్లో భాగంగా.. ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే తోటి ఆర్టీసీ సిబ్బంది నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి అనంతరం మెరుగైన చికిత్స కోసం ఎంజీఎంకు తరలించారు. ఎంజీఎంలో పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలిస్తుండగా శంకర్ గౌడ్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతితో ఆర్టీసీ కార్మిక వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

