కలం, జనగామ : బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తప్పవని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLA Palla Rajeshwar Reddy) హెచ్చరించారు. చేర్యాల మున్సిపల్ కేంద్రంలోని పీఎంఆర్ గార్డెన్లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తూ పేదల జీవితాలను దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల కష్టార్జితం ఈ అక్రమ మద్యం వ్యాపారాలకే వెళ్తోందని అన్నారు. “పేదోళ్ల కష్టార్జితం బెల్ట్ షాపులకు పోతుంటే చూస్తూ ఊరుకోను. నేను పైసలు తినను… తిననీయను” అని అన్నారు. సర్పంచ్లు, మహిళా సంఘాలు కలిసి బెల్ట్ షాపుల నిర్మూలనకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
పేదలను దోచుకునే ఈ వ్యవస్థను పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రెండున్నరేళ్లలో పేదలకు అండగా నిలిచానని గుర్తు చేసిన ఎమ్మెల్యే.. ప్రజలు తన పనితీరును గమనిస్తున్నారని అన్నారు. ఉదయం లేవగానే కుటుంబాల ఆదాయం మద్యం కొనుగోళ్లకే వెళ్లే పరిస్థితి నెలకొనడం బాధాకరమని తెలిపారు. అధికారుల సహకారంతో అక్రమంగా మద్యం విక్రయాలు, కల్తీ కార్యకలాపాలు నడుస్తున్నాయని ఆరోపించారు. ఈ సమస్యపై రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని, అక్రమ వ్యాపారాలను వదిలి ఇతర ఉపాధి మార్గాలు చేపట్టాలని సూచించారు. అక్రమ వ్యాపారాలపై ఉక్కుపాదం మోపడం తప్పదని హెచ్చరించిన ఆయన.. పేదల జీవితాలను కాపాడేందుకు తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

