కలం, వెబ్ డెస్క్: ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలంటూ నర్సంపేటలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన డ్రైవర్ శంకర్ గౌడ్ (Narsampet RTC Driver) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. దాదాపు 80% కాలిన గాయాలతో ఉన్న ఆయనకు తొలుత వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స అందించిన వైద్యులు ప్రభుత్వ ఆదేశం మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. కంచన్బాగ్లోని డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. మార్గమధ్యలో పరిస్థితి విషమమైంది. కంచన్బాగ్ డీఆర్డీవో ఆసుపత్రికి చేరుకున్న శంకర్ గౌడ్కు వైద్యులు అత్యవసర చికిత్స ప్రారంభించారు. వెంటిలేటర్ అమర్చినట్లు వైద్యులు తెలిపారు. క్యాబినెట్ సమావేశం పూర్తికాగానే రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఆస్పత్రికి వెళ్ళి శంకర్గౌడ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. శంకర్గౌడ్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ వారికి పరిస్థితిని అర్థం చేయించారు. నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్న శంకర్గౌడ్ ఉదయం డిపో వద్ద జరిగిన ఆందోళనలో భాగంగా తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. వెంటనే అప్రమత్తమైన తోటి కార్మికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేలోపే ఆయన శరీరం దాదాపు 80 శాతం కాలిపోయింది. వెంటనే వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం పరిస్థితి విషమంగానే ఉన్నదని, వెంటిలేటర్పై ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

