కలం, వెబ్ డెస్క్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ విజయశాంతి (MLC Vijayashanthi) సొంతపార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకు కాదు” అంటూ.. ఆర్టీసీ సమ్మె, శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నంపై స్పందిస్తూ పోస్ట్ చేశారు. ఆమె వ్యాఖ్యలు అధికార పార్టీని విమర్శించే తీరులో ఉన్నాయంటూ కాంగ్రెస్ శ్రేణులు విస్మయం వ్యక్తం చేశాయి.
’సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు తీవ్రమైన ఆందోళనతో, ఉద్వేగానికి గురై ఆత్మహత్యాయత్నాలు చేయడం అత్యంత బాధాకరం. తెలంగాణ అమరులు తమ పోరాటాలతో సాధించుకున్న రాష్ట్రం తిరిగి సమస్యలతో ఆత్మ బలిదానాల కోసం కాదు‘ అని ఆ పోస్టులో విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన శాసనమండలి సమావేశాల సందర్భంగా కూడా విజయశాంతి అమరవీరులకు న్యాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. ఇప్పుడు ఆర్టీసీ సమ్మె వేళ మరోసారి సొంత పార్టీని ఉద్దేశిస్తూ పరోక్షంగా విమర్శలు చేయడం కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

