కలం, నిజామాబాద్ బ్యూరో : మేకలు కాయడానికి వెళ్లిన ఓ యువకుడిపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన నిజామాబాద్ (Nizamabad) జిల్లా రూరల్ నియోజకవర్గం సిరికొండ మండలంలోని లొంక తాండలో చోటు చేసుకుంది. తండాకు చెందిన బాణవత్ అరవింద్ (18) అనే యువకుడు ఉదయం 8 గంటల సమయంలో మేకలు మేపేందుకు లొంక సమీప అటవీ ప్రాంతంలో ముక్క మైసమ్మ వద్దకు వెళ్లాడు.
ఆ సమయంలో అకస్మాత్తుగా ఎదురైన ఎలుగుబంటి అతనిపై దాడి చేయడంతో ఎడమ భుజం భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన అరవింద్ను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్టు గ్రామస్తులు తెలిపారు. అటవీ ప్రాంతాలకు వెళ్లి బీడీ ఆకులు తెంపే వారు పశువుల కాపర్లు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

