కలం, వెబ్డెస్క్: ఉగ్రవాదం మరింత విస్తరిస్తోందా? ఇప్పటివరకు ఆయా దేశాల్లో విడివిడిగా ఉన్న టెర్రరిస్ట్ గ్రూపులు (Lashkar – Hamas) ఒక్కటవుతున్నాయా? గ్లోబల్ టెర్రరిజానికి నాంది పలుకుతున్నాయా? పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. పాలస్తీనా కేంద్రంగా పనిచేసే హమాస్ ఉగ్ర సంస్థ, పాకిస్థాన్ కేంద్రంగా నడిచే లష్కరే తోయిబా మధ్య బంధం బలపడడం ప్రపంచ దేశాల అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ముఖ్యంగా ఈ పరిణామం భారత్కు ఆందోళన కలిగిస్తోంది.
ఇటీవల పాకిస్థాన్ మర్కాజి ముస్లిం లీగ్(పీఎంఎంఎల్) కమాండర్, పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్లో పనిచేసే లష్కరే తోయిబా టెర్రరిస్ట్ ఫైసల్ నదీమ్ ఓ వీడియోలో మాట్లాడుతూ.. తాను, పహల్గామ్ ఉగ్రదాడి మాస్టర్ మైండ్ సైఫుల్లా కసూరి కలసి ఖతార్ రాజధాని దోహాలో హమాస్ లీడర్ ఖాలేద్ మసూల్ను కలసినట్లు వెల్లడించాడు. మరోవైపు ఈ నెల 7న హమాస్ సీనియర్ కమాండర్ నాజీ జహీర్, లష్కర్ కమాండర్ రషీద్ అలీ సంధూ పాకిస్థాన్లోని గుజ్రన్వాలాలో భేటీ అయినట్లు బయటపడింది. పీఎంఎంఎల్ నిర్వహించిన ఒక బహిరంగ సమావేశంలో ఈ నేతలు కలసినట్లు వెల్లడైంది. వీళ్లు ఒకే వేదికపై కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.
ఈ క్రమంలో భారత నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. హమాస్, లష్కరే (Lashkar – Hamas) కలయిక దక్షిణాసియా, మధ్యప్రాచ్యంలో ఉగ్ర కార్యకలాపాలు పెంచే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా అనుసరించాల్సిన వ్యూహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను పెంచడంపై దృష్టి పెట్టాయి. అలాగే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) వంటి అంతర్జాతీయ వేదికలపై కూడా ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు భారత భద్రతా అధికారులు తెలిపారు.
కాగా, లష్కర్, హమాస్ మధ్య సమన్వయం, సహకారం ప్రపంచ ఉగ్రవాద నెట్వర్క్లో ప్రమాదకర మార్పులకు సంకేతమని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో ఖండాంతర ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Also: అమెరికాలో తెలంగాణ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
Follow Us On: Sharechat


