కలం, వెబ్ డెస్క్: అకాల వర్షాలతో రాష్ట్రంలోని పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వరి, అరటి, మామిడి రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. దీంతో రైతన్నలను ఆదుకోవడంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. గురువారం వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు(CM Chandrababu) సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో 1,215 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు వారు ముఖ్యమంత్రికి వివరించారు. ఆరు జిల్లాల్లోని 16 మండలాలపై పంట నష్టం అధిక ప్రభావం చూపిందని తెలిపారు. మరో 267 హెక్టార్లలోని ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రాథమిక అంచనాల వివరాలను అధికారులు వెల్లడించారు.
అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు.. పూర్తిస్థాయిలో పంట నష్టాన్ని లెక్కించాలని ఆదేశించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. రైతులెవ్వరూ అధైర్యపడవద్దని అన్నారు. పేదలకు ఆర్థిక సాయం చేసే సిఎంఆర్ఎఫ్ ఫైల్పై ఉగాది పండుగ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేశారు. ఈ సంతకంతో 6,787 మందికి ఆర్థిక సాయం అందించేందుకు రూ.55.63 కోట్లు విడుదల కానున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన 21 నెలల్లో ఒక లక్షా 36 వేల 240 మందికి రూ.1241 కోట్ల ఆర్థిక సాయం అందించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశానికంటే ముందు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) అధికారులతో అత్యవసర సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలోని అరటి, మామిడి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలకు నష్టం కలిగే ప్రమాదం ఉందని అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలను త్వరితగతిన గుర్తించి, నష్టాన్ని నమోదు చేయాలని అన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్నివిధాలుగా సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. పండిన పంటలను సాధ్యమైనంత త్వరగా సేకరించి భద్రపరచాలని చెప్పారు. వడగళ్ల వాన, ఈదురుగాలుల సమయంలో రైతులు పొలాల్లో ఉండకూడదని.. ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు.

