కలం, నిజామాబాద్ బ్యూరో: తలసేమియా పేషంట్ల కోసం నిజామాబాద్ (Nizamabad) జిల్లా రెవెన్యూ ఉద్యోగులు గొప్ప ఔదార్యం చాటుకున్నారు. జిల్లా ఉద్యోగ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇచ్చిన పిలుపును పురస్కరించుకుని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్, హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఈ శిబిరాన్ని ప్రారంభించగా.. పెద్ద సంఖ్యలో రెవెన్యూ ఉద్యోగులు, అసోసియేషన్ ప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. తలసేమియా రోగులను ఆదుకోవాలనే తపనతో రక్తదాన శిబిరం నిర్వహించడం గొప్ప విషయమని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారిణి బి.గీత, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్ కుమార్, రెడ్ క్రాస్ ప్రతినిధి బుస్స ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

