కలం, వెబ్డెస్క్: తన ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ వ్యవహారంపై కొందరు వ్యక్తులు తనపై దుష్ప్రచారం చేస్తూ, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ (Anchor Vishnupriya) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తప్పుడు ప్రచారాలకు వ్యతిరేకంగా ఆమె మియాపూర్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. దీనిపై ఇప్పటికే పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారని, త్వరలోనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోబోతున్నారని విష్ణు ప్రియ వెల్లడించారు. కొందరు అమ్మాయిలు కూడా తన క్యారెక్టర్ను కించపరిచేలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం వ్యూస్, డబ్బుల కోసం శరీరం అమ్ముకుంటోందనే రేంజ్ లో అత్యంత దారుణమైన పదజాలం వాడుతూ తనను మానసికంగా తీవ్రంగా వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వివాదంపై ఇప్పటివరకు చాలా రోజులు ఓపిక పట్టానని, ఎంతో నెగిటివిటీని, రాంగ్ పబ్లిసిటీని మౌనంగా భరించానని విష్ణుప్రియ పేర్కొన్నారు. అయితే ఇకపై తాను నోరు మూసుకొని ఉండేది లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పోరాటం కేవలం తన వ్యక్తిగత గౌరవం కోసమే కాదని, సమాజంలో ఇలాంటి డిజిటల్ వేధింపులను ఎదుర్కొంటున్న తోటి ఆడపిల్లలందరి కోసమే తాను ఈ అడుగు ముందుకు వేశానని స్పష్టం చేశారు. మహిళల జీవితాలతో ఆడుకునే వారికి చట్టపరంగా బుద్ధి వచ్చే వరకు తన పోరాటం ఆపనని విష్ణుప్రియ తేల్చి చెప్పారు.

