కలం, మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లాను పర్యాటకంగా మరింతగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా పురాతనమైన మెదక్ కోట (Medak Fort) ను పునరుద్ధరించి భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా ప్రత్యేక ప్రణాళికతో రూపొందిస్తున్నారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను ఎక్స్ ఫ్లోర్ చేసేలా, ప్రసుత్త ట్రెండ్కు తగ్గట్టు ఇన్ఫ్లుయెన్సర్ రీల్స్ కాంపిటిషన్ను జిల్లా యంత్రాగం నిర్వహిస్తుంది. మెదక్ ప్రాంతాన్ని టూరిస్ట్ హబ్గా మార్చడమే లక్ష్యంగా చేస్తున్న పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఘన చరిత్ర కల్గిన మెదక్ కోట
మెదక్ కోట తెలంగాణలోని అత్యంత ప్రాచీన, చారిత్రాత్మక కోటలలో ఒకటి. కాకతీయుల కాలంలో నిర్మించబడిన ఈ కోట బహమనీ, కుతుబ్షాహీ రాజవంశాల ఆధీనంలో కూడా ఉంది. 12వ, 13వ శతాబ్దాల్లో కాకతీయ రాజులు ఈ కోటను వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా నిర్మించారు. కోటలో హిందూ, ఇస్లామిక్ నిర్మాణ శైలుల మేళవింపు కనిపిస్తుంది. ఇది వివిధ రాజవంశాల పాలనను తెలియజేస్తుంది. మెదక్ కోటలో భారీ రాతి గోడలు, బలమైన ద్వారాలు, గోప్య మార్గాలు ఉండేవి. ముఖ్యంగా “ప్రధాన ద్వారం”పై ఉన్న సింహాల శిల్పాలు కాకతీయ శిల్పకళను ప్రతిబింబిస్తాయి. ప్రస్తుతం ఈ కోట పైభాగం నుంచి మెదక్ పట్టణం, పరిసర ప్రాంతాలు అందంగా కనిపిస్తుంది.ఈ కోటను వ్యూహాత్మక ప్రదేశం ఎంచుకొని, ప్రాచీన ద్వారాలు, ఫిరంగి స్థావరాలు, వాస్తు నిర్మాణ శైలి ప్రసిద్ధి చెందింది.
కోట అభివృద్ధి కోసం రూ. 10 కోట్లు
మెదక్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పురాతన చర్చి, ప్రఖ్యాత ఏడుపాయల వనదుర్గ అలయం, కొల్చారం జైన మందిరం, పోచారం అభయారణ్యం, పోచారం ప్రాజెక్టు గుర్తుకు వస్తాయి. పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఎంతో ఘన చరిత్ర ఉన్న మెదక్ కోటను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు కలెక్టర్ ప్రతిమా సింగ్. అందుకు అనుగుణంగా రూ.10 కోట్లతో కోట సమగ్ర అభివృద్ధి పనులు చేయాలని నిర్ణయించారు. మెదక్ కోట పునరుద్ధరణ, అభివృద్ధి, పరిరక్షణ కోసం జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, పురావస్తు శాఖ డైరెక్టర్ ప్రొపెసర్ అర్జున్ రావు, డాక్టర్ నాగరాజు, డిప్యూటీ డైరెక్టర్, శ్రీ ఎన్. నరసింగ్, డిప్యూటీ డైరెక్టర్ (ఇంజనీరింగ్), పర్యాటక శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి చర్చించారు.
మెదక్ కోట మొత్తం అభివృద్ధి కార్యక్రమాన్ని కోట పరిరక్షణ పనులు, ఆదాయ సృష్టి అంశాలు, భూదృశ్య అభివృద్ధి పనులు అని 3 రకాలుగా విభజించారు. పట్టణం నుండి కోట వరకు రోడ్డు, కోట వద్ద మార్గాలు, లైటింగ్తో సహ సందర్శకుల సౌకర్యాల కోసం తాగునీటి సౌకర్యాలు, కూర్చునే ఏర్పాట్లు, సూచికలు, పారిశుధ్య సౌకర్యాలతో పై ప్రణాళికను రూపొందించాలని నిర్ణయించారు. మెదక్ జిల్లాని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యచరణతో, వివిధ కార్యక్రమాలను చేపట్టి పర్యాటక ప్రాంతాలను తుది రూపు తీసుకువచ్చే విధంగా అధికారుల సమన్వయంతో మౌలిక వసతులు కల్పిస్తామని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.
ఇన్ఫ్లుయెన్సర్ రీల్స్ కాంపిటీషన్
ప్రెజెంట్ ట్రెండ్కు తగ్గట్టు రీల్స్తో మెదక్ పర్యాటక అందాలను విశ్వవ్యాప్తం చేయాలనే ఆలోచనతో తెలంగాణలో మొదటిసారిగా వినూత్న పద్ధతిలో జిల్లాలోని అనేక పర్యాటక ప్రాంతాలకు బ్రాండింగ్ కలిగించే విధంగా ‘ఇన్ఫ్లుయెన్సర్ రీల్స్ కాంపిటీషన్’ నిర్వహించడానికి జిల్లా యంత్రాగం సిద్ధమైంది. ఇందులో భాగంగా మెదక్ జిల్లా పర్యాటక ప్రాంతాలపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యూత్ 4K వీడియో క్వాలిటీతో రీల్స్ సమర్పించాల్సి ఉంటుంది.
రీల్స్ కాంపిటీషన్ ద్వారా మెదక్ జిల్లా పర్యాటక ప్రాంతాలకు మంచి బ్రాండింగ్ వచ్చే విధంగా పూర్తి వివరాలతో, పర్యాటకులను ఆకట్టుకునే విధంగా రీల్స్ను రూపొందించిన వారికి నగదు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. ఇన్ఫ్లుయెన్సర్ రీల్స్ కాంపిటీషన్పై ఆసక్తి గలవారు తమ వీడియోలను మే 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో సమర్పించవచ్చని, ఆన్లైన్ విధానంలో డీపీఆర్ఓ రాజు 9949922291, ఏపీఆర్ఓ బాబు 9701306838 నంబర్లకు వాట్సాప్ ద్వారా తాము చేసిని రీల్స్ను పంపే అవకాశం కల్పించారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం జూన్ 2వ తేదీన నగదు ప్రోత్సాహకాలు అందించనున్నారు.

