కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణలో పెట్రోల్, డీజిల్ (Petrol Diesel) నిల్వలు సమృద్దిగా ఉన్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఎలాంటి అపోహలకు గురి కావద్దని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకి 9,574 కిలోలీటర్ల పెట్రోల్, 14,457 కిలో లీటర్ల డీజిల్ కలిపి మొత్తం 24 వేల కిలో లీటర్ల పైగా పెట్రోల్, డీజిల్ బంకుల ద్వారా వాహనదారులకు అందిస్తున్నామని వివరించారు. అలాగే వినియోగదారులకు 2 లక్షల 22 వేలకు పైగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేస్తున్నట్లు వివరించారు.
కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు..
పెట్రోల్, డీజిల్ సరఫరా, గ్యాస్ ను ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ హెచ్చరించింది. అలాంటి ఘటనలు ఎక్కడైనా చోటు చేసుకుంటే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1967 కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. ఏపీలో చమురు కొరత వార్తల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.

