కలం, వెబ్ డెస్క్ : డీలిమిటేషన్ పై దుష్ప్రచారం చేస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీ స్థానంలో కూర్చోవాలని ఉబలాటపడుతున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజన అంశంలో సీఎం రేవంత్ ప్రతిపాదనపై బండి కౌంటర్ ఇచ్చారు. జీడీపీ ఆధారంగా సీట్లు పెంచితే కేవలం హైదరాబాద్ లోనే నియోజకవర్గాలు పెరుగుతాయని.. చివరకు రేవంత్ రెడ్డి పోటీ చేయడానికి కొండంగల్ నియోజకవర్గం కూడా ఉండదంటూ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన డీలిమిటేషన్ బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకోకపోతే తెలంగాణలో ఎంపీ, ఎమ్మెల్యేల స్థానాల సంఖ్య 50 శాతం పెరిగేవని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ తో పాటు మిగతా ప్రతిపక్ష పార్టీల వల్లే నియోజకవర్గాల పునర్విభజన ఆగిపోయింది అని బండి సంజయ్ (Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు.

