కలం, నిర్మల్: వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో ప్రజలు పురాతన సాంప్రదాయమైన కప్పతల్లి ఆట (Kappa Thalli Ritual) నిర్వహించి సందడి చేశారు. గ్రామీణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ ఆచారాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ వానదేవుడిని ప్రార్థించారు. ఈ సందర్భంగా రెండు కప్పలను ఒకటిగా కట్టి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. కప్పలపై నీళ్లు పోసి అభిషేకాలు నిర్వహిస్తూ వర్షాలు కురవాలని, రైతుల పొలాలు పచ్చగా కళకళలాడాలని కోరుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో తరతరాలుగా కొనసాగుతున్న ఈ ఆచారం ప్రకారం కప్పలకు నీరు పోసి పూజలు చేస్తే వాన దేవుడు ప్రసన్నమై మంచి వర్షాలు కురిపిస్తాడనే విశ్వాసం ఉంది. అదే నమ్మకంతో నిర్మల్ పట్టణంలో ప్రజలు కూడా కప్పతల్లి ఆట (Kappa Thalli Ritual) నిర్వహించి ప్రత్యేక పూజలు చేసి వాన దేవునికి మొక్కులు చెల్లించారు. సంప్రదాయ సంస్కృతిని కాపాడుతూ నిర్వహించిన ఈ కార్యక్రమం స్థానికులను ఆకట్టుకోగా, పాత ఆచారాలకు ఇప్పటికీ ప్రజల్లో ఉన్న ఆదరణ మరోసారి స్పష్టమైంది.
Read Also: రేవంత్ వార్నింగ్.. ఆఫీసర్లు డోంట్ కేర్!
Follow Us On: Instagram

