కలం, వెబ్ డెస్క్: తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇంత దరిద్రపు పాలన ఎప్పుడూ చూడలేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ఫైర్ అయ్యారు. ఈ మేరకు మహబూబ్ నగర్ నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతు ఎదుర్కొంటున్న సమస్యలు.. ఎస్ఐఆర్ సర్వే సమయంలో ఎలా వ్యవహారించాలనే విషయాలపై మాట్లాడారు. 15 రోజుల నుంచి కొనుగోలు సెంటర్ కి వడ్లు తీసుకొస్తే.. రేవంత్ సర్కార్ ఇప్పటివరకూ ఒక్క గింజ కూడా కొన్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్లు కొంటే మద్దతు ధర, బోనస్ ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం కొనడం లేదని ఆరోపించారు. దళారులకు అప్పగిస్తే వాళ్ళు కమీషన్ ఇస్తారని.. అందుకే వదిలేశారని విమర్శించారు. రైతులు రూ. 300 నుంచి రూ.800 వరకు తక్కువ ధరకు వడ్లు ప్రైవేట్ వాళ్లకు అమ్మకం చేస్తున్నారని చెప్పారు. వానకు తడిసి ఎండకు ఎండి రైతన్నకు చివరకు గిట్టుబాటు ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతు భరోసా (Rythu Bharosa) ఇస్తామని చెప్తున్న రేవంత్ ప్రభుత్వం ఇంకా ఇవ్వడం లేదని అన్నారు. కనీసం యూరియా సకాలంలో ఇవ్వలేదని.. సాగుకు అనుకూలంగా కరెంటు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కరెంటు ఎప్పుడు వస్తుందో, పోతుందో తెలియక మోటార్ల వద్ద రైతులు పడుకున్న పరిసితి కనిపించిందన్నారు. ఆలా కష్టపడి పంట పండించిన ప్రభుత్వం వడ్లు కొనడం లేదన్నారు. అకాల వర్షంతో ధాన్యం తడిసిపోతుందని రైతులు టార్పాలిన్ కవర్లు కొనుక్కుని కప్పుకుంటున్నారని.. కొన్ని చోట్ల ధాన్యం తడిసిందని చెప్పారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము రోడ్డెక్కుతామని.. అందరు రైతులను కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని ఆయన (Srinivas Goud) హెచ్చరించారు. మళ్ళీ తమ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని.. ఆ తరవాత రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు.
Read Also: అమ్రాబాద్ అడవుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
Follow Us On: Instagram

