కలం/ఖమ్మం బ్యూరో: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి (Ponguleti Srinivas Reddy) శుభవార్త చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టామని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలంతో పాటు రూ. 5 లక్షల సాయం అందిస్తాం” అంటూ పొంగులేటి పేర్కొన్నారు. శనివారం ఆయన ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని విస్తృతంగా పర్యటించి ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “ఎన్నికలు రాగానే ప్రత్యర్థులు మీ ముందుకు వచ్చి సొల్లు కబుర్లు చెబుతారు.. మాయమాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ, పదేళ్లు అధికారంలో ఉండి పేదవాడికి ఒక ఇల్లు కూడా ఇవ్వని వారు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు?” అని పేర్కొన్నారు.
అకౌంట్లు నింపుకోవడమే గత పాలకుల ధ్యేయం
బీఆర్ఎస్ పదేండ్ల పాలనపై పొంగులేటి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “గత దొరల పాలనలో పేదలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఆనాటి పాలకులు తమ అకౌంట్లు నింపుకోవాలని చూశారే తప్ప, సామాన్యుల సంక్షేమాన్ని గాలికొదిలేశారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని కుమ్మరించి, కేవలం కమిషన్ల కోసం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నేడు కళ్లముందే కూలిపోతోంది. ఇది వారి అవినీతికి నిదర్శనం కాదా?” అని ప్రశ్నించారు. రెండు సార్లు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను వంచించిన చరిత్ర వారిదని ఎద్దేవా చేశారు.
ఏదులాపురానికి కొత్త హంగులు
ఏదులాపురం మున్సిపాలిటీని (Yedulapuram Municipality) రాష్ట్రానికే రోల్ మోడల్గా తీర్చిదిద్దుతానని మంత్రి పునరుద్ఘాటించారు. “వచ్చే వర్షాకాలం నాటికి మున్నేరు రక్షణ గోడను పూర్తి చేసి ప్రజల కష్టాలు తీరుస్తాం. ఎఫ్.సి.ఐ గోడౌన్ తరలింపుతో పాటు ఇక్కడ అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తాం. మీ కష్టం తెలిసిన మీ పెద్ద కొడుకుగా నేను మీకు అండగా ఉంటా” అని హామీ ఇచ్చారు. విపక్షాల సొల్లు కబుర్లను నమ్మకుండా, అభివృద్ధిని కాంక్షిస్తూ హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన (Ponguleti Srinivas Reddy) పిలుపునిచ్చారు.
Read Also: ఇదే నా చివరి మీటింగ్ : జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి
Follow Us On: Instagram


