కలం, వెబ్ డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులో విరాట్ కోహ్లీ ప్రాముఖ్యత గురించి ఆ జట్టు మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ (AB de Villiers) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోహ్లీని ఆర్సీబీ జట్టుకు గుండెకాయ లాంటివాడని అభివర్ణించారు. కేవలం బ్యాటింగ్లో తన నిలకడైన ప్రదర్శనతోనే కాకుండా, మైదానంలో కోహ్లీ ప్రదర్శించే పోరాట పటిమ జట్టులోని యువ ఆటగాళ్లలో నమ్మకాన్ని నింపుతాయని డివిలియర్స్ పేర్కొన్నారు. కోహ్లీ తన ఆటతీరుతో జట్టును ఎప్పుడూ ముందుండి నడిపిస్తాడని, గెలుపుపై జట్టుకు భరోసానిస్తాడని ఆయన కొనియాడారు.
గత సీజన్లో ఆర్సీబీ టైటిల్ గెలవడానికి గల కారణాలను ఏబీ విశ్లేషించాడు. జట్టు కేవలం ఒకరిద్దరు ఆటగాళ్లపైనే ఆధారపడకుండా టీమ్గా రాణించిందని డివిలియర్స్ అన్నారు. గతంలో ఆర్సీబీ కేవలం కొద్దిమంది ఆటగాళ్లపైనే భారం వేసేదని, కానీ గత ఏడాది రజత్ పాటిదార్, లివింగ్స్టోన్ వంటి ఇతర ఆటగాళ్లు కూడా కీలక సమయాల్లో రాణించడంతో కోహ్లీపై ఒత్తిడి తగ్గిందని చెప్పారు. ప్రస్తుతం ఆర్సీబీలో పోరాడే ఆటగాళ్లు ఉన్నారని, ఈ సారి కూడా వారు టైటిల్ను నిలబెట్టుకుంటారనే నమ్మకం తనకు ఉందని డివిలియర్స్ ధీమా వ్యక్తం చేశారు.

