కలం, వెబ్డెస్క్: భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Mother of All Deals) కుదిరినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(ఎఫ్టీఏ) దేశ చరిత్రలోనే అతిపెద్దదిగా ఆయన అభివర్ణించారు. యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా, ఈయూ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్డర్ లేయెన్తో కలసి ఆయన మాట్లాడారు. ‘ జనవరి 27న ఈయూలోని 27 దేశాలతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఇది పెట్టుబడులను పెంచుతుంది. వాణిజ్య, సప్లయ్ చైన్లను ప్రపంచ స్థాయిలో బలోపేతం చేస్తుంది. ఇది కేవలం వాణిజ్య ఒప్పందం కాదు.. రెండు ప్రాంతాల ఉమ్మడి శ్రేయస్సును ప్రతిఫలించే ప్రణాళిక’ అని మోదీ (PM Modi) అన్నారు.
ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య బంధానికి ఈ ఒప్పందం ఒక మైలురాయి లాంటిదని పీఎం మోదీ పేర్కొన్నారు. ‘భారత్, ఈయూ సంయుక్త జీడీపీ 25శాతం. అంటే ఇది ప్రపంచ జీడీపీలో ముప్పావు భాగం. ఇది కేవలం వాణిజ్య ట్రేడ్ కాదు. రెండు ప్రాంతాల మధ్య ప్రజాస్వామ్యం, చట్టాలను పరిరక్షణలో భాగమయ్యే డీల్’ అని ప్రధాని అన్నారు.
విన్–విన్ ట్రేడ్: ఉర్సులా వాన్డర్ లేయెన్
భారత్, ఈయూ మధ్య ఒప్పందం చారిత్రాత్మకమని ఈయూ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్డర్ లేయెన్ అన్నారు. ఈ ట్రేడ్ను ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’(Mother of All Deals)గా పేర్కొన్న ఆమె.. ఎన్నో ఏళ్లుగా సాధ్యంకాని డీల్ను సాధించినట్లు పేర్కొన్నారు. రెండు ప్రాంతాలకు ఈ ఒప్పందం విన్–విన్ (సమాన గెలుపు) లాంటిదని ఆమె అన్నారు. ఈ ఒప్పందం దాదాపు 4 బిలియన్ యూరోల మేర సుంకాల్లో కోత పెడుతుందని చెప్పారు. ఇది రెండు ప్రాంతాలకూ మేలు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా భారత గణతంత్ర వేడుకలకు ఆహ్వానించినందుకు, ట్రేడ్ డీల్ కుదిరినందుకు ప్రధాని మోదీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా భారత్కు రావడం జీవితాంతం గుర్తుండిపోయే గౌరవం, జ్ఞాపకం అని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
Read Also: సుప్రీంకోర్టు తీర్పు.. HCU విషయంలో అలా.. అహ్మదాబాద్ పై ఇలా
Follow Us On : WhatsApp


