కలం, మహబూబ్ నగర్ బ్యూరో: రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటర్ల జాబితా ప్రక్షాళన విజయవంతం అయ్యేలా సహకరించాలని మహబూబ్ నగర్ (Mahbubnagar) జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా కోరారు. గురువారం కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)పై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బూత్ లెవెల్ అధికారులు.. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి అధికారులకు క్షేత్రస్థాయి సన్నాహక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు బీఎల్ఓలు ప్రతి ఇంటికీ తిరిగి ఎన్యుమరేషన్ ఫారాల్లో వివరాలను సేకరిస్తారని తెలిపారు. 2002 ఓటర్ల జాబితా ఆధారంగా కుటుంబ సభ్యుల వివరాలను ఇందులో నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. జులై 24 నుంచి 30 వరకు ప్రతి పోలింగ్ కేంద్రంలో గరిష్ఠంగా 1,200 మంది ఓటర్లు ఉండేలా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ చేపడతారని వివరించారు.
నోటీస్ ఇచ్చి.. వివరణ తీసుకుని..
ఓటర్ల ముసాయిదా జాబితా జులై 31న ప్రచురించి, అభ్యంతరాల స్వీకరిస్తామని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేస్తారన్నారు. తప్పు సమాచారం ఇస్తే పేరు తొలగించకుండా, ముసాయిదా జాబితా తర్వాత నోటీసు ఇచ్చి, విచారణ జరిపి చర్యలు తీసుకుంటారన్నారు. వలస వెళ్లిన, మరణించిన, డూప్లికేట్ ఓటర్లను తొలగిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుత జాబితాలో పేరు లేని కొత్త ఓటర్లు తప్పనిసరిగా ఫామ్-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారిన వారు ఫామ్-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.ఎల్.బి హరిప్రియ, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సాయి శివానితో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు సాయి బాబా (కాంగ్రెస్), యాద సత్యం.(బిఆర్ఎస్), పి.రాజేందర్ రెడ్డి (బీజేపీ), ఎం.డి.అబ్దుల్ హాది, సాదతుల్ల,(ఎంఐఎం), బి.డి.సామ్యూల్(వైసీపీ), వై.నర్సింహులు (బీఎస్పీ), ఎం.మురళి(టీడీపీ) పాల్గొన్నారు.

