కలం, వెబ్డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Jeevan Reddy) అలిగారు. కాంగ్రెస్ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఎలా కూర్చోబెడతారంటూ అర్దాంతరంగా వెళ్లిపోయారు. బుధవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నేతల సమావేశం జరిగింది. ఈ పార్లమెంట్ పరిధిలో మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తం, ప్రణాళికలపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జీవన్ రెడ్డి.. అక్కడ జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను చూసి షాకయ్యారు. వెంటనే సమావేశం నుంచి అర్ధాంతరంగా బయటకు వచ్చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
కాంగ్రెస్ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఎలా కూర్చోబెడతారంటూ జీవన్ రెడ్డి (Jeevan Reddy) ప్రశ్నించారు. సంజయ్ తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని స్పీకర్ దగ్గర చెప్పుకున్నారని, అలాంటి వ్యక్తిని ఇప్పుడు కాంగ్రెస్ సమావేశంలోకి అనుమతించారని అన్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేను పక్కన కూర్చోబెట్టుకొని మున్సిపల్ ఎన్నికల గురించి ఎలా చర్చిస్తామని ప్రశ్నించారు. ‘రాజ్యాంగ ఉల్లంఘన చేసి వచ్చిన వ్యక్తి పక్కన మమ్మల్ని కూర్చోబెడితే మాకు గౌరవం ఎలా?’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేకపోతున్నానని చెప్పారు. రాహుల్ గాంధీ విధానాన్ని అపహాస్యం చేస్తున్నారని, ఈ విషయం గురించి పీసీసీ చీఫ్ను అడిగినా స్పందన రాలేదని చెప్పారు. ప్రజాపాలన వల్ల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ వందశాతం గెలుస్తుందని మరో ప్రశ్నకు సమాధానంగా జీవన్ రెడ్డి అన్నారు.


