కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రజల కోసం రేయింబవళ్లు కష్టపడి పని చేస్తున్నా రాజకీయంగా ఎదురవుతున్న అవమానాలు, దూషణలు కలిచివేస్తున్నాయని హోం మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) ఆమెపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె ఎక్స్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటిందని, ప్రపంచం సాంకేతికత వైపు అడుగులు వేస్తూ ముందుకు పోతున్నా కొందరి ఆలోచనలు మాత్రం ఇంకా మహిళలపై దిగజారుడు వ్యాఖ్యలు చేసే స్థాయిలోనే ఉన్నాయన్నారు.
తాను కుటుంబానికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా త్యాగం చేసి మంత్రిగా ప్రజల కోసం నిత్యం కష్టపడుతున్నానని తెలిపారు. దానికి ప్రతిఫలంగా నీచమైన దూషణలు, అవమానాలు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కష్ట కాలంలో కులమతాలకు, లింగభేదాలకు అతీతంగా తన ఆత్మగౌరవ పోరాటానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ అనిత ధన్యవాదాలు తెలిపారు. తనకు తోబుట్టువుల్లా ధైర్యాన్నిచ్చిన ప్రతి ఒక్కరి అండతో ఏ శక్తులకూ లొంగకుండా ప్రజల కోసం తన ప్రయాణాన్ని మరింత బలంగా కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేశారు.
మరోవైపు అనితపై చేసిన వ్యాఖ్యలపై గుడివాడ అమర్నాథ్ వెనక్కి తగ్గడం లేదు. తాను మహిళా లోకంపై మాట్లాడలేదని, కేవలం ఒక వ్యక్తి సభ్యత, సంస్కారహీనంగా మాట్లాడిన మాటలను మాత్రమే ఖండించానని ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఇక టీడీపీ, జనసే, బీజేపీల నాయకులు అమర్నాథ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వంగలపూడి అనితకు (Vangalapudi Anitha) మద్దతుగా పోస్టులు చేస్తున్నారు.
Read Also: బీహార్లో టీటీడీ ఆలయ నిర్మాణం.. భూ కేటాయింపులు పూర్తి
Follow Us On: X(Twitter)

