కలం, వెబ్ డెస్క్ : గోద్రా అనే పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది మతహింస. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు అద్భుతమైన సంఘటన ఆవిష్కృతమైంది. గుజరాత్ రాష్ట్రంలోని గోద్రా మున్సిపల్ ఎన్నికల్లో (Godhra Municipal Elections) 100 శాతం ముస్లింలు ఉన్న వార్డులో హిందూ మహిళ విజయ ఢంకా మోగించింది. ఎన్నికల్లో మెజారిటీ వర్గం ఏది ఉంటే అటు వైపే విజయం మొగ్గు చూపుతుంది. ఈ విషయం అందరికి తెలిసిందే.. చాలా సార్లు నిరూపితమైందే. అయితే, ఈ ఆచారాన్ని తిరగరాసింది గోద్రా పట్టణంలోని వార్డు అభ్యర్థి అపేక్షాబెన్ నైనేష్ భాయ్ సోని అనే మహిళ.
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అపేక్షాబెన్ విజయం మతం కంటే అభివృద్ధికి పట్టం కట్టినట్లు కనిపిస్తోందని స్థానిక రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆమె ఆ వార్డు ఓటరు కాకపోయిన వార్డు ప్రజల నమ్మకాన్ని చూరగొన్నది. అసెక్షాబెన్ గెలుపు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. అసెక్షాబెన్ సోనికి బలమైన మెజారిటీ అందించడంలో ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషించారు. కాగా, గోద్రా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లు సాధించింది. పట్టణ ప్రాంతాల్లో దాదాపు అన్ని చోట్ల కాషాయం హవా కొనసాగించింది. మొత్తం 15 మున్సిపల్ కార్పొరేషన్లను బీజేపీ కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించింది.

