కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్(West Bengal)లో అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. భవానీపూర్ నియోజకవర్గంలో సీఎం మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారి మధ్య పోరు అత్యంత హైవోల్టేజీగా మారింది. ఇద్దరు నేతల అనుచరుల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ముర్షిదాబాద్, సిలిగురి ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడం కలకలం రేపింది. కొన్ని పోలింగ్ కేంద్రాల సమీపంలో బాంబులు పేలినట్లు వార్తలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఓ బీజేపీ అభ్యర్థి నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడి చేసినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అనేక ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద రాళ్లదాడులు, ఘర్షణలు చోటుచేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఓటర్లు భయంతో కొంతమేర ప్రభావితమయ్యారని సమాచారం. అయినప్పటికీ పలు చోట్ల భారీ భద్రత మధ్య పోలింగ్ కొనసాగుతోంది. పోలీసులు పరిస్థితిని పూర్తిగా నియంత్రణలోకి తెచ్చేందుకు గస్తీ పెంచారు. కేంద్ర బలగాలు ప్రజలపై లాఠీ చార్జ్ చేశాయని మమతా బెనర్జీ ఆరోపించగా టీఎంసీ కార్యకర్తలే అరాచకానికి పాల్పడ్డారని బీజేపీ ప్రత్యారోపణ చేస్తోంది.

