కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి(Sangareddy) జిల్లా హత్నూర మండలం పల్పనూరు (Palpanoor) గ్రామ శివారులోని మంజీరా నది (Manjira River)లో వేల సంఖ్యలో చేపలు మృతిచెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉదయం చేపల వేటకు నదిలోకి వెళ్లిన మత్స్యకారులు, కుప్పలు తెప్పలుగా తేలియాడుతున్న చేపలను చూసి షాక్కు గురయ్యారు.
పెద్దఎత్తున చేపలు చనిపోవడంతో నది పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్వాసన వస్తుంది. దీంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా నక్కవాగు ద్వారా పారిశ్రామిక వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ రసాయన వ్యర్థాల వల్లనే చేపలు మృతిచెందాయని మత్స్యకారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ, సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోందని వారు ఆరోపిస్తున్నారు.
కాలుష్య నియంత్రణ మండలి అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని స్థానికులు మండిపడుతున్నారు. కాలుష్యానికి కారణమైన పరిశ్రమలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక టన్నుల కొద్దీ చేపలు చనిపోవడంతో తమకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని మత్స్యకారులు వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

