కలం, వెబ్ డెస్క్ : మారుతున్న కాలంతో పాటు పిల్లల్లో పెరుగుతున్న అనారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని, గూడూరు గ్రామస్తులు (Guduru village) ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. నాణ్యత లేని ఐస్క్రీంల విక్రయాల వల్ల పిల్లలు తరచూ దంత సమస్యలు, జీర్ణకోశ వ్యాధుల బారిన పడుతున్నారని గుర్తించిన గ్రామ పెద్దలు, వారం క్రితం ఐస్క్రీం బండ్లపై పూర్తిస్థాయి నిషేధం విధించారు.
ఒకవేళ ఈ నియమాన్ని ఉల్లంఘించి ఎవరైనా ఐస్క్రీం బండిని గ్రామంలోకి తీసుకువస్తే, వారికి ఏకంగా రూ. 5,000 జరిమానా విధిస్తామని గ్రామ పంచాయతీ స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై ఊరి పొలిమేరల్లో ప్రదర్శించిన బ్యానర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పిల్లల శ్రేయస్సు కోసం తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ, తమ ఊరి పిల్లల భవిష్యత్తు కోసం తీసుకున్న ఈ నిర్ణయానికే కట్టుబడి ఉంటామని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

