కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు ప్రకటించనున్నది. రాష్ట్రంలోని అన్ని ఇంటర్మీడియెట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రానున్న విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజన పథకం అమలుకానున్నది. ఇందుకోసం బడ్జెట్లో (Telangana Budget) నిధులను కేటాయించనున్నది. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో డ్రాపౌట్లను తగ్గించడం, అడ్మిషన్లను పెంచడం కోసం ఈ స్కీమ్ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయం తీసుకున్నది. ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) గతంలో పలుమార్లు చర్చించారు. సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అమలుపై రివ్యూ సందర్భంగా దీని గురించి చర్చించారు. ఈ స్కీమ్ అమలులోని అనుకూల, ప్రతికూల అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ప్రాథమిక నిర్ణయం జరిగింది. బడ్జెట్లో నిధుల కేటాయింపుతో రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి రానున్నది.
ప్రతీ విద్యార్థికి రూ. 14 చొప్పున.. :
రాష్ట్రంలోని సుమారు 430 జూనియర్ కాలేజీల్లో మిడ్-డే మీల్ స్కీమ్ (Mid Day Meal Scheme) అమలులోకి వస్తుంది. ప్రతీ విద్యార్థికి రూ. 14 చొప్పున ఖర్చవుతున్నట్లు అంచనా వేసిన ప్రభుత్వం దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నది. ఈ స్కీమ్ అమలుతో నెలకు రూ. 180 కోట్ల చొప్పున ఖజానాపై భారం పడుతున్నా విద్యపై వెచ్చిస్తున్నందున అది రాష్ట్ర అభివృద్ధికి, యువత ఫ్యూచర్కు పెట్టుబడిగా ఉంటుందన్నది ముఖ్యమంత్రి అభిప్రాయం. ప్రైవేటు జూనియర్ కాలేజీలకు మాత్రం ఇది వర్తించదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో లభించిన ఫలితాలు ఇకపైన గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని జూనియర్ కాలేజీల్లోనూ కొనసాగుతాయన్నది ప్రభుత్వ నమ్మకం.
Read Also: సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి : కేటీఆర్
Follow Us On : WhatsApp

