కలం, వెబ్ డెస్క్: దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక- 2026లో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ (Clean Energy) రంగంలో రూ.6 వేల కోట్ల పెట్టుబడికి ఒప్పందం కుదిరింది. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ (ఎస్ఎంఆర్) ఆధారిత విద్యుత్ ప్రాజెక్ట్ అభివృద్ధికి స్లోవాకియాకు చెందిన న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సంస్థ ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) సమర్పించింది. దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐక్యూ క్యాపిటల్ గ్రూప్ ఛైర్మన్ డా. జాన్ బాబిక్, గ్రూప్ సీఈఓ , డైరెక్టర్ అనిల్ కుమార్ బావిసెట్టి, గ్రీన్ హౌస్ ఎన్విరో సీఈఓ , డైరెక్టర్ మొలుగు శ్రీపాల్ రెడ్డి , స్లోవాక్ రిపబ్లిక్ కాన్సుల్ మాటుస్ జెమెస్ పాల్గొన్నారు.
క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నాం: రేవంత్ రెడ్డి
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ (Clean Energy) ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందన్నారు. 2047 నాటికి నెట్–జీరో అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడంలో సుస్థిర అభివృద్ధే తెలంగాణకు ప్రధానమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. స్లోవాకియాకు చెందిన ఐక్యూ క్యాపిటల్ , భారత్కు చెందిన గ్రీన్ హౌస్ ఎన్విరో సంయుక్త భాగస్వామ్యంలో న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ ఏర్పడింది. గరిష్ఠంగా 300 మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణ లో కొత్త విద్యుత్ ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం పెట్టుబడి విలువ 600 మిలియన్ యూరోలు (సుమారు రూ.6,000 కోట్లు).


