కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పలు కులాల పేర్లు మార్చుతూ తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) జీవోలు జారీ చేసింది. ఇక నుంచి వాటిని కొత్తగా పేర్కొన్న పేర్లతోనే పిలవాలని స్పష్టం చేసింది. “పిచ్చిగుంట్ల” కులం పేరును వంశరాజ్గా మార్చింది. తెలంగాణ బీసీ కమిషన్ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సమాజంలో ఈ పేరుతో తమను అవమానకరంగా, అసభ్యరీతిలో సంబోధిస్తున్నారని.. కొన్ని సంవత్సరాలుగా ఈ కులం వారు సీఎం రేవంత్ రెడ్డికి విన్నవిస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం వీరి పేరు మార్చడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 1995 కంటే ముందు నుంచే వీరిని వంశరాజ్ కులస్థులుగా పిలిచేవారని వివరించింది.
పాత పేర్లు శాశ్వతంగా తొలగింపు..
బుడబుక్కల పేరు స్థానంలో ఇక నుంచి “శివ క్షత్రియ” అని పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. అలాగే, దొమ్మర పేరుకు బదులు “గద వంశీయ” అని సంబోధించాలని సూచిస్తూ మరో ఉత్తర్వు విడుదల చేసింది. ఇక, శూద్ర కులం పేరును బీసీ జాబితాలో నుంచి తొలగించి.. “తమ్మాలీ కులం”గా మార్చింది. పాత పేర్లను అన్ని జాబితాల్లో నుంచి శాశ్వతంగా తొలగించింది.

