కలం, వెబ్ డెస్క్: డీఎంకే (DMK) యువజన విభాగం నిర్వాహకుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, ఆమోదించిన తీర్మానాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తమిళనాడు కాంగ్రెస్ (Tamil Nadu Congress) కమిటీ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ లౌకిక విధానాలు, ప్రజాస్వామ్య విలువలు, కూటమి ధర్మాన్ని కాపాడుకుంటూనే పని చేస్తుందని స్పష్టం చేసింది. తమిళనాడు రాజకీయాల్లో వివిధ ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు ఏకమై కలిసి పని చేసిన చరిత్రను ఎవరూ తిరస్కరించలేరని గుర్తు చేసింది. ప్రజాస్వామ్య రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమేనని, అయితే వాటిని వ్యక్తపరిచే క్రమంలో అనవసరమైన పదజాలం ఉపయోగించడం, ఆరోపణలు చేయడం రాజకీయ నైతికత అనిపించుకోదని హితవు పలికింది.
కాంగ్రెస్ పార్టీపై డీఎంకే శ్రేణులు మోపిన ద్రోహం, వెన్నుపోటు అనే నిందలను తమిళనాడు కాంగ్రెస్ కమిటీ పూర్తిగా తిరస్కరించింది. కాంగ్రెస్ ఎల్లప్పుడూ విలువల ఆధారిత రాజకీయాలకే కట్టుబడి ఉంటుందని పేర్కొంది. రాజకీయాల్లో పరస్పర గౌరవం, హుందాతనం పాటించాలన్నదే తమ విధానమని స్పష్టం చేసింది. కూటమిలో ఉంటూ ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం, వ్యతిరేక తీర్మానాలు ఆమోదించడం తీవ్రంగా ఖండించదగిన విషయమని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించింది. మరోవైపు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ వర్సెస్ డీఎంకే మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది.

