కలం, కరీంనగర్ బ్యూరో : ముదిరాజ్ కులస్తులను బీసీ-డీ (BC-D) గ్రూప్ నుండి బీసీ-ఏ (BC-A) గ్రూప్లోకి మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర బీసీ-ఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గడప కోటేశ్ కుమార్ (Gadapa Kotesh Kumar) ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ-ఏ గ్రూప్లో ఉన్న కులాలు ఇప్పటికే తీవ్ర వెనుకబాటుతనానికి గురై, సరైన ఉపాధి లేక, జీవనోపాధి కరువై ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థికంగా, సామాజికంగా ఎంతో సంపన్న వర్గానికి చెందిన ముదిరాజ్లను తీసుకువచ్చి బీసీ-ఏ లో కలపడం వల్ల, ప్రస్తుతం ఈ గ్రూప్లో ఉన్న పేద కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కాబట్టి ముదిరాజ్లను బీసీ-డీ నుండి బీసీ-ఏ కి మార్చాలనే ప్రతిపాదనను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం బీసీ-ఏ లో ఉన్న 57 కులాలు విద్య, ఆర్థిక, రాజకీయంగా తీవ్ర వెనుకబాటుతనంతో జీవిస్తున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ సమావేశంలో బీసీ-ఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గడప కోటేశ్ కుమార్ (గంగపుత్ర)తో పాటు జిల్లా సెక్రటరీ జంపాల నర్సయ్య (నాయిబ్రాహ్మణ), ట్రెజరర్ జంగం సురేశ్, (నాయిబ్రాహ్మణ) శ్రీరాముల రమేశ్, అలిపి రెడ్డి లచ్చయ్య (మేదరి), ఏకుల రమేశ్ (మేదరి), శంకర్ (రజక) తదితరులు పాల్గొన్నారు.

