కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ఇక నుంచి కేబినెట్ (Cabinet) సమావేశాలను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించబోతున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశాలు ఇకపై తెలంగాణ డిజిటల్ కేబినెట్గా ఉండబోతున్నట్లు స్పష్టం చేశారు. ఐటీ విభాగం తరఫున మంత్రి శ్రీధర్ బాబు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు స్పెషల్ ట్యాబ్లు అందజేశారు. ఇందులో సమావేశం ఎజెండా, నోట్స్ అన్నీ మంత్రులకు అందుబాటులో ఉంచారు. పేపర్ లెస్ గవర్నెన్స్లో భాగంగా ఈ విధానం అమల్లోకి తెస్తున్నట్లు, ఇకపై కాగితాలతో పని లేదని తెలిపారు.
ఉపాధి హామీ పథకంపై కేబినెట్ సబ్ కమిటీ..
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి తెచ్చిన వీబీజీ రామ్ జీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని కేబినెట్ పేర్కొంది. పాత ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కొత్త చట్టం అమలుతో కూలీలు, రాష్ట్ర ప్రభుత్వంపై పడే ప్రభావాన్ని సమగ్రంగా పరిశీలించేందుకు కేబినేట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనిలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వివేక్ వెంకటస్వామి ఉంటారు.
మెట్రో విస్తరణకు అనుమతులు ఇవ్వండి..
హైదరాబాద్ ట్రాఫిక్, ప్రయాణికుల అవసరాల దృష్ట్యా మెట్రో విస్తరణకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రి వర్గం విజ్ఞప్తి చేసింది. ఐఆర్ఎఫ్సీ ఒప్పందం ప్రకారం రావాల్సిన రుణాన్ని వెంటనే మంజూరు చేయించాలని కోరింది. కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు విస్తరణకు సహకరించాలని కోరింది. కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు ఇప్పించేందుకు ఆ పార్టీ నేతలు కలిసిరావాలని కోరింది.

