కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే మూసీ నది ప్రక్షాళన చేసేందుకు నిర్ణయించుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఒకప్పుడు మూసీ నది ఒడ్డున ఉన్న వారిని నందనవనం ప్రాంతానికి తరలించారని వివరించారు. ఆ సమయంలో అక్కడకు వెళ్లడానికి ఎవరూ ఇష్టపడలేదని, కానీ ఇప్పుడు వారి ఓట్లు లేకపోతే ఎంపీ, ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి లేదన్నారు. మూసీ కాలుష్యం ధాటికి ఎల్బీ నగర్ ప్రాంతంలో నీరు పచ్చ రంగులో వచ్చేవన్నారు. దిల్సుఖ్నగర్ ప్రాంతంలో రాత్రి పూట దోమలు హడలెత్తించేవన్నారు. తాను కూడా ఆ బాధలు పడిన వ్యక్తిని కాబట్టే.. మూసీ నదిని కాలుష్య కోరల్లో నుంచి కాపాడాలని నడుం బిగించినట్లు వివరించారు.
దేవుడి భూములను వదల్లేదు..
వనస్థలిపురంలో దేవుడి భూముల్ని కూడా కబ్జా పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. భూ కబ్జాలతో ప్రజలకు సమస్యలు రావద్దనే హైడ్రా తెచ్చామని.. దాన్ని ఒక భూతంలా చూపిస్తున్నారని విమర్శించారు. హైడ్రా ఎప్పుడూ పేదల జోలికి వెళ్లదని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములు కబ్జా చేసే వారి వీపు సున్నం చేస్తామని హెచ్చరించారు.

