కలం, వెబ్ డెస్క్ : శ్రీలంక- ఎతో జరిగిన మ్యాచ్లో చోటుచేసుకున్న వివాదంపై వచ్చిన వార్తలకు బీసీసీఐ (BCCI) స్పష్టత ఇచ్చింది. ఈ ఘటనలో బోర్డు జోక్యం చేసుకోదని కార్యదర్శి దేవజిత్ సైకియా (Devajit Saikia) తెలిపారు. ట్రై-నేషన్ ఎ సిరీస్లో భాగంగా భారత్-ఎ, శ్రీలంక ఎ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగిసి సూపర్ ఓవర్కు వెళ్లింది. చివరికి శ్రీలంక-ఎ విజయం సాధించిన తర్వాత, వారి ఆటగాడు విశెన్ హలంబాగే భారత ఆటగాళ్లపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. దీంతో మైదానంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో హలంబాగే వైభవ్ సూర్యవంశీకి (Vaibhav Sooryavanshi) దగ్గరగా రావడంతో యువ బ్యాటర్ అతడిని దూరంగా నెట్టినట్లు తెలిసింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, బీసీసీఐ చర్యలు తీసుకుంటుందనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ విషయంపై స్పందించిన దేవజిత్ సైకియా, మైదానంలో జరిగే క్రమశిక్షణ చర్యలు పూర్తిగా మ్యాచ్ రిఫరీ, అంపైర్ల పరిధిలోనే ఉంటాయని స్పష్టం చేశారు. అందులో బీసీసీఐకి ఎలాంటి పాత్ర లేదని చెప్పారు.
ఇదిలా ఉంటే, శ్రీలంక క్రికెట్ నియమించిన మ్యాచ్ రిఫరీ ప్రదీప్ జయప్రకాశ్ హలంబాగే, నిరోషన్ డిక్వెల్లాపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అయితే ఆ శిక్షల వివరాలు ఇంకా వెల్లడించలేదు. భారత్-ఎ ఆటగాళ్లు, కెప్టెన్ తిలక్ వర్మపై ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న దానిపై కూడా స్పష్టత లేదు. మ్యాచ్ విషయానికి వస్తే, ఇరు జట్లు 265 పరుగులు చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. సూపర్ ఓవర్లో 17 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఎ కేవలం 9 పరుగులకే పరిమితమైంది. చివరి మూడు బంతులలో వైభవ్ సూర్యవంశీ ఆరు పరుగులు చేసినా, జట్టుకు విజయం అందించలేకపోయాడు.

