కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లోని జూబ్లీ బస్స్టేషన్ (JBS) సమీపంలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా వస్తున్న బస్సు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రోడ్డుపై వెళ్తున్న ఓ బైక్ రైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
బాధితుడు బస్సు టైర్ల కింద ఇరుక్కుపోయాడు. అతడి కాలు బస్సు చక్రాల కింద నలిగిపోవడంతో తీవ్ర నొప్పితో విలవిలలాడాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై బాధితుడిని బస్సు కింద నుంచి బయటకు తీసి చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సుల నిర్వహణపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగర రహదారులపై కొన్ని బస్సులు అతివేగంగా ప్రయాణిస్తున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా, ఇండికేటర్లు ఇవ్వకుండా కొందరు డ్రైవర్లు బస్సులు నడుపుతున్నారని పలువురు వాపోతున్నారు. వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ప్రయాణికులు, వాహనదారుల భద్రత కోసం ఆర్టీసీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Read Also: గులాబీ రేకులతో మెరిసే చర్మం.. ఈ బ్యూటీ టిప్స్ మీకోసమే!
Follow Us On: Sharechat

