కలం, వరంగల్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వరంగల్ ఎంపీ (Warangal MP) కడియం కావ్య (Kadiyam Kavya), వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు (KR Nagaraju) తెలిపారు. హనుమకొండ (Hanumakonda) జిల్లా మడికొండ (Madikonda) మహిళా ప్రాంగణంలో ఏర్పాటు కానున్న పెట్రోల్ బంక్కు వరంగల్ ఎంపీ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, కుడా చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి అధికారులతో కలిసి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, మహిళల పేరుమీదే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
గత ప్రభుత్వాలతో పోలిస్తే మహిళా సంఘాలకు అధిక మొత్తంలో వడ్డీలేని రుణాలను అందజేస్తున్నామని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణంపై కొందరు విమర్శలు చేసినప్పటికీ ప్రభుత్వం మహిళలను కేవలం ప్రయాణికులుగానే కాకుండా ఆర్టీసీ వ్యవస్థలో భాగస్వాములు, యజమానులుగా తీర్చిదిద్దే దిశగా ప్రణాళికలు రూపొందిస్తోందని వివరించారు. మడికొండలో మహిళల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు కావడం ఆనందదాయకమని, మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, అవకాశాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు, మహిళలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

