కలం, వెబ్ డెస్క్ : జైళ్లు, కేసులు తమకు కొత్తేమీ కాదని, అణచివేతను ఎదుర్కొని మళ్లీ అధికారంలోకి వస్తాం అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (MLA Jagadish Reddy) తెలిపారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను చంచల్ గూడ జైలులో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తో కలిసి జగదీశ్ రెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో ఎన్ని రకాల కేసులు ఉంటే అన్ని రకాల కేసులు పెట్టి బాల్కసుమన్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. హైకోర్టు స్వయంగా ఆ సెక్షన్లు కొట్టివేయాలని చెప్పిందని జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు. బీఆర్ఎస్ నాయకులను చంపేస్తామని కాంగ్రెస్ నాయకులు గతంలో బెదిరించినప్పుడు తాము ఎవరి మీద కేసులు పెట్టలేదని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ అక్రమంగా కేసులు పెడుతోందని జగదీశ్ రెడ్డి విమర్శించారు.

