కలం, వెబ్ డెస్క్: పెరుగుతున్న ఇంధన ధరలు ఆటో డ్రైవర్ల (Auto Drivers) జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రస్తుతం LPG ధరలు ఆకాశాన్నంటుతుండటంతో ఆటో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. ఒకవైపు గ్యాస్ ధరలు భారీగా పెరగడం, మరోవైపు గంటల తరబడి గ్యాస్ స్టేషన్ల వద్ద క్యూలో వేచి ఉండాల్సి రావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆటో ఛార్జీలు పెంచితే ప్రయాణికులు రావడం లేదని, పెంచకపోతే కుటుంబ పోషణ భారమవుతోందని చెప్తున్నారు.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఓ ఆటో డ్రైవర్తో ముచ్చటించాడు. కామారెడ్డి నుంచి వచ్చిన ఓ ఆటో డ్రైవర్ హైదరాబాద్లో ఆటో నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ ఎదురుపడగా కేటీఆర్ మాట్లాడారు. ‘‘ఎట్లుంది కామారెడ్డి.. ఆటో బాగా నడుస్తుందా’ అని అడగ్గా.. గ్యాస్ దొరక్క ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం ఆటో డ్రైవర్ల బతుకులు కష్టంగా ఉన్నాయని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని చెప్పగా.. కేటీఆర్ థ్యాంక్స్ చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

