కలం, వెబ్ డెస్క్: నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షం రైతులను నిండా ముంచింది. మార్కెట్ యార్డులో నిల్వ చేసిన మొక్కజొన్న పంట ఒక్కసారిగా నీటిలో తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికందే దశలో ఉన్న పంట ఇలా వర్షపు నీటిపాలు కావడంతో రైతులు ఆవేదనకు గురయ్యారు.
వర్షం తగ్గిన తర్వాత కూడా యార్డులో నీరు నిల్వ ఉండటంతో పంటను రక్షించుకోవడం కష్టంగా మారింది. ఈ పరిస్థితిని గమనించిన స్థానిక ఎస్సై సద్దాం వెంటనే తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. రైతుల కష్టాన్ని ప్రత్యక్షంగా చూసిన పోలీసులు సహాయ చర్యలకు ముందుకు వచ్చారు.
తడిసిన మొక్కజొన్నను ఎండబెట్టేందుకు వీలుగా బుట్టల్లో, సంచుల్లో నింపి సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో పోలీసులు రైతులకు తోడుగా నిలిచారు. కేవలం భద్రతా విధులకే పరిమితం కాకుండా, ప్రత్యక్షంగా పంటను కాపాడే పనిలో పాల్గొనడంతో రైతులు ఊరట పొందారు. పంట నష్టంతో బాధపడుతున్న రైతులకు పోలీసుల ఈ సహాయ చర్య పెద్ద సాంత్వనగా నిలిచింది. స్థానికంగా ఈ ఘటనపై రైతులు పోలీసుల తక్షణ స్పందనను అభినందించారు.

