కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల సమస్యలపై పిడిఎస్యూ (PDSU) నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి సమస్యలను గుర్తించి పరిష్కరించాలని పిడిఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు.
నిజామాబాద్ నగరంలోని శంకర్ భవన్ ప్రభుత్వ పాఠశాల గేట్ వద్ద పిడిఎస్యూ (PDSU) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న బ్రేక్ఫాస్ట్, మిల్క్ పథకాలను అన్ని ప్రభుత్వ పాఠశాలలలో పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలలో (Govt Schools) మౌలిక సదుపాయాల కొరత కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల సంఖ్యకు తగినంత టాయిలెట్స్ లేకపోవడం, వర్షాకాలంలో కొన్ని తరగతి గదులలో నీరు కారుతుండటం వంటి సమస్యలను ప్రస్తావించారు.
పాత గదుల స్థానంలో కొత్త తరగతి గదులు నిర్మించాలని, విద్యార్థులకు సకాలంలో యూనిఫార్మ్స్ అందించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు సమస్యల వలయంలో ఉన్నాయని, అందుకే ప్రజాప్రతినిధులు ప్రత్యక్షంగా పాఠశాలలను సందర్శించి సమస్యలను పరిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో పిడిఎస్యూ నగర అధ్యక్షుడు సిర్రం పవన్ కుమార్, నాయకులు శ్రీకర్, భవాని, దత్తు, వంశీ, చరణ్, శ్రీజ తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Also: శ్రీలంక మాజీ కెప్టెన్ను ఆకట్టుకున్న వైభవ్
Follow Us On: Sharechat

