కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ వి. అరవింద్ బాబు (DCP Aravind Babu)పై బదిలీ వేటు పడింది. ఆయనను తక్షణమే విధుల్లోంచి తొలగిస్తూ, రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయానికి నివేదించాల్సిందిగా ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతృత్వంలో జరిగిన ఆందోళనల నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని మార్ఫింగ్, అభ్యంతరకర కంటెంట్ను పోస్ట్ చేశారనే ఆరోపణలపై మెటా ఇండియా హెడ్తో పాటు పలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై సైబర్ క్రైమ్ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఈ పరిణామమే డీసీపీ బదిలీకి కారణమైనట్లు తెలుస్తోంది.
బిజెపి మద్దతుదారుల ఫిర్యాదు మేరకు సిజెపి నిరసన వీడియోలను సర్క్యులేట్ చేస్తున్న సామాజిక మాధ్యమాల ఖాతాలపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేయడంపై ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) సీనియర్ అధికారులు, ఉన్నత పోలీస్ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. విద్యార్థుల నిరసనలకు జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో కాంగ్రెస్ నాయకత్వం మద్దతు ఇస్తున్న సమయంలో ఈ కేసులు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుల నమోదుకు దారితీసిన పరిస్థితులపై సమాచారం సేకరించిన ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారుల ద్వారా డీసీపీ అరవింద్ బాబును హైదరాబాద్ కమీషనరేట్ విధుల నుండి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

