కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది జిహెచ్ఎంసీ డివిజన్ల సమగ్ర అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (MLA Gudem Mahipal Reddy).. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజనను కోరారు. తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీలు జిహెచ్ఎంసిలో విలీనమయ్యే సమయంలో రూ. 250 కోట్ల మిగులు నిధులను సైతం డివిజన్ల అభివృద్ధికి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
గచ్చిబౌలిలోని సిఎంసి ప్రధాన కార్యాలయంలో కమిషనర్ తో ఎమ్మెల్యే సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. అమీన్ పూర్ సర్కిల్, పటాన్ చెరు సర్కిల్ లోని డివిజన్లలో ప్రధానంగా మినీ స్టేడియాలు, చెరువులు, స్మశాన వాటికలు, మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించాలన్నారు. రెండు సర్కిళ్ల పరిధిలో శరవేగంగా నూతన కాలనీలు ఏర్పాటు అవుతున్నాయని చెప్పారు. ఇందుకు అనుగుణంగా మౌలికవసతులైన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇచ్చి నిధులను కేటాయించాలని గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.

