కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు నిర్మల్ పోలీసులు (Nirmal Police) ప్రత్యేక ట్రాఫిక్ నిర్వహణ చర్యలు చేపట్టారు. గురువారం డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన కూడళ్లు, అధిక రద్దీ ప్రాంతాలను పరిశీలించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే చర్యలు చేపట్టారు.
స్థానిక బస్టాండ్, ఆటో స్టాండ్, అంబేద్కర్ చౌక్, వివేక్ చౌక్, కిసాన్ షాపింగ్ మాల్ పరిసరాల్లో ట్రాఫిక్కు అంతరాయం కలిగించే ఆక్రమణలు, రహదారులపై వ్యాపారం నిర్వహిస్తున్న చిరు వ్యాపారులకు సూచనలు చేశారు. అలాగే అక్రమ పార్కింగ్ను అరికట్టి వాహనాలను నిర్దేశిత పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలిపేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రత్యేక ట్రాఫిక్ నిర్వహణ కార్యక్రమం రేపటి నుంచి అమల్లోకి రానుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు సమ్మయ్య, కృష్ణ, ఆర్ఐలు రామ్ నిరంజన్, రామకృష్ణ, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

