కలం, వెబ్ డెస్క్: డిగ్రీ (Degree) విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్తగా ప్రవేశ పెట్టిన అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ (APED) ప్రోగ్రామ్స్ కోర్సుల్లో చేరేందుకు రేపటి నుంచి వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చని తెలంగాణ దోస్త్ కన్వీనర్ ఆచార్య బాలకిష్టారెడ్డి తెలిపారు. మూడు రోజుల పాటు ఇంటర్నల్ స్లైడింగ్స్ కొనసాగనుంది.
ఇప్పటికే వివిధ కోర్సుల్లో చేరిన వారు ఆప్షన్ పెట్టుకుని ఏపీఈడీ కోర్సులో జాయిన్ కావొచ్చు. డిగ్రీ చదివిన విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ఈ కొత్త కోర్సులను డిజైన్ చేశారు.
27 రకాల కోర్సులు..
బీఎస్సీ, బీకాం, బీఏతో పాటు డిగ్రీలో మొత్తం 27 రకాల ఏపీఈడీ కోర్సులు ప్రవేశ పెట్టారు. బీఎస్సీ విద్యార్థులకు ఎలక్ట్రానిక్స్, మాన్యుఫాక్చరింగ్, డెయిరీ, హార్టికల్చర్, కంప్యూటర్ సర్వీసెస్ వంటి 8 రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
బీకాం విద్యార్థులకు బిజినెస్ మేనేజ్ మెంట్, బిజినెస్ అనలిటిక్స్, మార్కెటింట్ కోర్సులున్నాయి. బీఏ వారికి యానిమేషన్, ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ కోర్సులున్నాయి. సంబంధిత పూర్తి వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
చివరి ఏడాది అప్రెంటిస్షిప్..
డిగ్రీలో సాధారణంగా ఆరు సెమిస్టర్లుంటాయి. ఏపీఈడీ కోర్సుల్లో నాలుగే సెమిస్టర్లు ఉంటాయి. చివరి ఏడాది మొత్తం పరిశ్రమల్లో అప్రెంటిస్షిప్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు గాను ప్రతి నెల రూ.8 వేల స్టైఫండ్ కూడా చెల్లిస్తారు.
డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఇలా అప్రెంటిస్షిప్ పూర్తి చేసినవారిలో సుమారు 80 శాతం మందికి కచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత స్కిల్ ప్రోగ్రాం కూడా.
ఒకేసారి రెండు ప్రయోజనాలు..
ఏపీఈడీ కోర్సులతో రెండు రకాల ప్రయోజనాలున్నాయి. డిగ్రీ పూర్తి చేసినట్లు సర్టిఫికేట్ రావడంతో పాటు అప్రెంటిస్ షిప్ సర్టిఫికేట్ కూడా ప్రదానం చేస్తారు. దీని వలన భవిష్యత్తులో ఉద్యోగాల్లో చేరే సమయంలో మొదటి ప్రాధాన్యం దక్కుతుంది.
డిగ్రీ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని.. కొత్త కోర్సుల్లో చేరాలని దోస్త్ కన్వీనర్ సూచించారు.

