కలం, నిర్మల్: జాతీయ పునర్నిర్మాణం, దేశభక్తి భావాలను విద్యార్థుల్లో పెంపొందించడమే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) లక్ష్యమని జాతీయ కార్యవర్గ సభ్యులు బోడ లక్ష్మణ్ పేర్కొన్నారు. జాతీయ విద్యార్థి దినోత్సవం (National Students Day) సందర్భంగా గురువారం నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వివేక్ చౌక్లోని స్వామి వివేకానంద విగ్రహం వద్ద ఏబీవీపీ జెండాను ఆవిష్కరించారు.
ఐదుగురు విద్యార్థులతో ప్రారంభమైన ఏబీవీపీ నేడు దేశవ్యాప్తంగా 78 లక్షల మంది సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎదిగిందని అన్నారు. దేశ సమైక్యత, జాతీయ భద్రత, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం ఏబీవీపీ అనేక ఉద్యమాలు నిర్వహించిందని తెలిపారు. దేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దే ప్రయాణంలో ప్రతి విద్యార్థి భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ దినేష్, నితీష్, వంశీ, అభి, సాయిచరణ్, కార్తీక్, మణి తదితర ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

