కలం, వెబ్డెస్క్: ఏపీలోని కర్నూలు జిల్లాలోనూ పోలీసుల వేధింపులు మితిమీరిపోయాయంటూ తిరుపతి వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి (Maddila Gurumoorthy) జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. కర్నూలుకు చెందిన బాలు అనే యువకుడిపై త్రీ టౌన్ పోలీసులు అనవసరంగా ఒత్తిడి తెస్తూ ఎటువంటి క్రిమినల్ కేసులు లేకపోయినా పదేపదే స్టేషన్కు పిలిపించి వేధిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో పోలీసులు బాలుపై తప్పుడు, లిక్కర్ డ్రగ్స్ కేసులు బనాయించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ మానసిక వేధింపులు భరించలేక సదరు యువకుడు చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం అత్యంత విచారకరమని ఎంపీ తన లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దుర్వినియోగం అవుతోందని, పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని, గురుమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడికి జరిగిన అన్యాయంపై తక్షణమే స్వతంత్ర విచారణ జరిపించాలని, బాధ్యులైన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన మానవ హక్కుల కమిషన్ను కోరారు. రాజ్యాంగంలోని అధికరణలు 14, 21 కల్పించిన జీవించే హక్కును , గౌరవాన్ని పోలీసులు కాలరాస్తున్నారని విమర్శించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా ఫిర్యాదుకు జత చేస్తూ , బాధితుడి కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

