కలం, వెబ్డెస్క్: సంగారెడ్డి (Sangareddy) జిల్లా పరిధిలో పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా అటవీ సరిహద్దు గ్రామాల్లో తిరుగుతున్న పులి పశువులపై వరుసగా దాడులు చేస్తుండడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా సిర్గాపూర్ మండలం కడ్పల్ (Kadpal) గ్రామంలో పులి లేగదూడపై దాడి చేసి చంపేసింది. పులి ఆనవాళ్లు గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఫారెస్ట్ అధికారులు పులిసంచారంపై నిఘా పెంచారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి సమయాల్లో రైతులు ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అంతే కాకుండా పులి కదలికను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అటవీశాఖ అధికారులు సూచించారు. అయితే ఎప్పడు ఏ వైపు నుంచి పులి వస్తుందోనని గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు.

