కలం, కరీంనగర్ బ్యూరో : పెద్దపల్లి (Peddapalli) జిల్లా కేంద్రంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని ఈద్గా కాలనీలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఈద్గా కాలనీకి చెందిన సయ్యద్ జాబేర్ అనే వ్యక్తి మంగళవారం రాత్రి అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందినట్లు సమాచారం.
స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మృతుడు జాబేర్కు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యతో గతంలోనే విడాకులు అయ్యాయి. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం జాబేర్ తన రెండో భార్యతో కలిసి నివసిస్తున్నాడు. ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే గత కొంతకాలంగా దంపతుల మధ్య తీవ్ర విభేదాలు, గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ కేసులో నిందితులు ఎవరు? రెండో భార్యకు ఈ ఘటనతో సంబంధం ఉందా? లేదా మరే ఇతర కోణాలు ఉన్నాయా? అనే అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: బోగస్ ఉద్యోగుల ఏరివేతకు సర్కార్ ప్లాన్
Follow Us On: X(Twitter)

