కలం, వరంగల్: వరంగల్ (Warangal) జిల్లా నెక్కొండ (Nekkonda) పోలీస్ స్టేషన్ ఎస్ఐ మహేందర్ (SI Mahender) సస్పెన్షన్ నేపథ్యంలో మండల కేంద్రంలో కొందరు స్థానికులు సంబరాలు నిర్వహించారు. ఎస్ఐపై వచ్చిన అవినీతి ఆరోపణలపై శాఖాపర విచారణ అనంతరం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ కావడాన్ని స్వాగతిస్తూ స్థానికులు స్వీట్లు పంచుకున్నారు. బాణాసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేయడంతో పాటు వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతారెడ్డి (Swetha) చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ, పోలీసులు రాజకీయాలకు అతీతంగా, నిష్పక్షపాతంగా ప్రజలకు సేవలు అందించాలని కోరారు. అవినీతి ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకున్న పోలీస్ కమిషనర్ శ్వేతారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ శాఖలో పారదర్శకత, జవాబుదారీతనం కొనసాగాలని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా అధికారులు విధులు నిర్వహించాలని వారు కోరారు.

