కలం, నిర్మల్: మారుమూల గ్రామాల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) ఆదేశించారు. మంగళవారం నిర్మల్ (Nirmal) జిల్లా కుంటాల మండలంలోని అంబుగాం గ్రామంలో పర్యటించిన కలెక్టర్ గ్రామంలోని తాగునీటి వసతి, విద్యుత్, టెలికాం సేవలు, ఇతర మౌలిక సదుపాయాలపై స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
గ్రామస్తులకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామంలో తాగునీటి సమస్య అధికంగా ఉన్న నేపథ్యంలో గ్రామపంచాయతీ తీర్మానం చేసి ప్రతిపాదనలు పంపితే వెంటనే నూతన బోరుబావి మంజూరు చేస్తామని తెలిపారు. బోరుబావి ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని, ట్రాన్స్ఫార్మర్ను పరిశీలించి అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, డీపీఓ శ్రీనివాస్, డీఆర్డీఓ విజయలక్ష్మి, ఈఈ ఆర్డబ్ల్యూఎస్ సందీప్, తహశీల్దార్ కమల్ సింగ్, ఎంపీడీఓ వనజ, సర్పంచ్ శివాజీ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

