కలం, వెబ్ డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తున్న నియోజక వర్గాల పునర్విభజన బిల్లుపై సీఎం చంద్రబాబు (Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ తో దక్షిణ రాష్ట్రాలకు ఎలా అన్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. తమిళనాడులో రెండో రోజు ఎన్డీయే తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా మంగళవారం ఎన్నికల ప్రచార ప్రెస్మీట్లో సీఎం మాట్లాడారు. కేంద్రం ప్రస్తావిస్తోన్న 50 శాతం డీలిమిటేషన్తో సీట్లు ఎలా తగ్గుతాయని ప్రశ్నించారు. ఈ విషయంలో సీట్లు తగ్గుతాయని చెబుతున్న కాంగ్రెస్, డీఎంకే పార్టీలు దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్తో సీట్లు తగ్గవని చెప్పడానికి తానే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. లోక్ సభలో మోదీ ప్రభుత్వం ప్రవేశబెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకుని ఏం సాధించారు? అని అడిగారు.
కేంద్రంలో మోదీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం అధికారంలో ఉందని చంద్రబాబు అన్నారు. కేంద్రం ఉదారంగా నిధులు ఇస్తున్నప్పుడు వినియోగించుకోవాలి కదా అని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాల కోసం చెన్నైకి కేంద్రం రూ.14 లక్షల కోట్లు ఇచ్చిందని.. కేంద్ర నిధులను దారి మళ్లించడం సమంజసమా? అని ప్రశ్నించారు. తమిళనాడుకు పూర్వ వైభవం రావాలంటే ఎన్డీయే కూటమిని గెలిపించాలని కోరారు. దేశానికి మోదీ వంటి సమర్థ నాయకత్వం ఉందని అభిప్రాయపడ్డారు. సరైన సమయంలో మంచి ఆలోచన చేయాలని తమిళనాడు ప్రజలను కోరారు. సమర్థులను ఎన్నుకుంటే రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పారు.

